ఎండోస్కోపీ ఎప్పుడు...? ఎందుకు? ఎలా చేస్తారు...?

నోటిలో ఏదైనా సమస్య ఉంటే నోరు తెరవమని డాక్టర్లు అడుగుతారు. గొంతులో ఏదైనా ఉంటే టార్చ్‌లైట్ వేసి చూస్తారు. అక్కడి నుంచి కిందిగా ఏదైనా సమస్య ఉంటే...? చూస్తే దాన్ని బట్టి చికిత్స అందివ్వవచ్చు. కొన్ని లోపలి అవయవాలను నేరుగా చూడటం కుదరదు. అయితే మన జీర్ణవ్యవస్థ అంతా ఒక నాళంలో ఉంటుంది. కాబట్టి ఓ కెమెరా పంపిస్తే...? నోటిలోకో, గొంతులోకో చూసినట్లుగా చూడవచ్చు కదా....? ఆ ఆలోచనతోనే రూపొందిన పరీక్ష ప్రక్రియ ఎండోస్కోపీ. అంతేకాదు... కొన్ని సందర్భాల్లో కేవలం పరీక్ష కోసమే గాక... చికిత్స కోసం ఇది ఉపయోగపడుతుంది?

ఎండోస్కోపీని డాక్టర్లు ఈసోఫేగో గ్యాస్ట్రో డియోడనస్కోపీ (ఈజీడీ) అంటారు. దీనితో ఆహారనాళం, కడుపు, చిన్న పేగులు మొదలయ్యే ప్రదేశం... చిన్న పేగుల్లో కొంత భాగం (డియోడనమ్) వరకు చూడవచ్చు.

ఎండోస్కోపీ ఎందుకు...?
వాంతులు, వికారం, పొట్టలో నొప్పి, మింగడంలో ఇబ్బందులు ఉన్నప్పుడు సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకోవడానికి.

రక్తహీనత, రక్తస్రావం, మంట, విరేచనాలు, కొన్ని క్యాన్సర్లు ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థలోని ఆ భాగానికి చెందిన చిన్న ముక్కను తీసి బయాప్సీ పరీక్ష కోసం పంపించడానికి.

సన్నటి పైప్‌లా ఉండే ఆహారనాళం లేదా అన్నకోశం (స్టమక్)లో ఏదైనా పరికరంతో చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు, అక్కడ కండపెరిగితే తొలగించాల్సి వచ్చినప్పుడు, అందులో బయటి నుంచి వచ్చి చేరే వస్తువు (ఫారిన్‌బాడీ)లను తొలగించాల్సి వచ్చినప్పుడు.

ఎండోస్కోపీ ఎలా చేస్తారు...?
ఎండోస్కోపీ ప్రక్రియలో పేషెంట్‌ను వెల్లకిలా లేదా ఒక పక్క ఒరిగి పడుకొమ్మని చెబుతారు. సాధారణంగా కొన్నిసార్లు బీపీ, గుండెస్పందనలను చూసేందుకు వీలుగా పరికరాలు అమర్చి ఎండోస్కోపీని కొనసాగిస్తారు. కొందరిలో మాత్రం పేషెంట్ ఎండోస్కోపీకి సహకరించేందుకు ఒక్కోసారి కాసేపు మత్తు ఇవ్వాల్సి వస్తుంది.

నోటిలో అనస్థీషియాను స్ప్రే చేసి ఒక ఫ్లెక్సిబుల్ ట్యూబ్‌ను జీర్ణవ్యవస్థలోకి పంపిస్తారు. దానికి ఒక కెమెరా అమర్చి ఉంటుంది. అది మొదట ఆహారనాళంలోకి, ఆ తర్వాత అన్నకోశం (స్టమక్)లోకి వెళ్తుంది. అక్కడి దృశ్యాలను టీవీలా కనిపించే మానిటర్‌పై డాక్టర్ చూస్తారు. అంతేకాదు... ఆహారనాళంలోని దృశ్యాలను రికార్డు కూడా చేస్తారు.

మొదట ఏదైనా ప్రిపరేషన్ అవసరమా...
ఎండోస్కోపీ చేయడానికి ముందర ఆరు గంటల పాటు ఏదీ తినకుండా ఉండాలి.
రక్తాన్ని పలచబార్చే మందులు ఉపయోగిస్తుంటే వాటిని ఆపాలి. ఎందుకంటే అది ఆ టైమ్‌లో రక్తస్రావానికి దారితీసి ఆపవచ్చు.

కొలనోస్కోపీ...
ఎండోస్కోపీ ద్వారా చిన్న పేగు మొదటి భాగం వరకూ చూడవచ్చు. మరి ఆ కింది భాగం విషయమో...? అందుకోసం ఉపయోగపడేదే కొలనోస్కోపీ.

ఆహార నాళం నుంచి పైప్ వేసినట్లుగా చూసి పరీక్షించినట్లే మల ద్వారం ద్వారా పైప్ నుంచి పంపించి చూసే పరీక్షను కొలనోస్కోపీ అంటారు.

ఎవరెవరిలో చేయాలి...?
మలద్వారం నుంచి రక్తస్రావం అవుతున్నవారిలో.
దీర్ఘకాలంగా మలబద్దకం ఉన్నవారిలో.
ఏదైనా దీర్ఘకాలిక సమస్య ఉన్నవారిలో

దీనికి అవసరమైన ప్రిపరేషన్...
ఎండోస్కోపీలోలా కాకుండా కొలనోస్కోపీ చేయాల్సి వచ్చినప్పుడు కడుపునంతా ఖాళీ చేయాలి. దానికోసం రాత్రి భోజనం తర్వాత ఏమీ తినేందుకు అవకాశం ఉండదు కాబట్టి సమస్య లేదు. ఆ తర్వాత కూడా కేవలం నీరు, పాలు లేకుండా టీ, కాఫీ, కొన్నిసార్లు సాఫ్ట్‌డ్రింక్ వంటివి పరిమితంగా తీసుకొమ్మని చెబుతారు. ఎర్రగా ఉండే ద్రవాలను తీసుకోవద్దని సూచిస్తారు. ఎందుకంటే... కొలనోస్కోపీలో అవి కనిపిస్తే దాన్ని రక్తంగా పొరబడే అవకాశాలను నివారించేందుకు ఆ సూచన చేస్తారు. గుండెజబ్బులు, డయాబెటిస్, రక్తపోటు వంటివి ఉన్నవారిలో వాటికి సంబంధించిన మందులు ఒక వారం ముందునుంచి నిలిపివేయాలని చెబుతారు. రక్తాన్ని పలచబార్చే ఆస్పిరిన్, వార్‌ఫేరిన్, క్లోపిడోగ్రెల్ వంటి మందుల మోతాదులను డాక్టర్ సలహా మేరకు మారుస్తారు.

ఎలా చేస్తారు...?
చాలా సార్లు మత్తు ఏమీ ఇవ్వకుండా చేస్తారు. చాలా కొద్ది మంది రోగులకు మాత్రమే మత్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులోనూ కెమెరాను అమర్చిన పైప్‌ను మలద్వారం ద్వారా పంపించి దాదాపు పెద్ద పేగు వరకూ చూస్తారు. దీనికి పట్టే వ్యవధి దాదాపు 20 నిమిషాలు. ఈ పరీక్ష తర్వాత ఒక గంట పాటు కింది నుంచి చాలాసార్లు గ్యాస్ పోతుంటుంది.

ఎండోస్కోప్, కొలనోస్కోప్ సహాయంతో మనం దాదాపు మన జీర్ణవ్యవస్థను ప్రత్యక్షంగా చూడటం, అక్కడ ఉన్న అదనపు కండ (పాలిప్)ను తొలగించుకోవడం సాధ్యమవుతుంది.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top