కేదార్‌నాథ్‌లో కేదారేశ్వర ఆలయాన్ని ఎప్పుడు తెరుస్తారు? అక్కడికి ఎలా వెళ్లాలి.


కేదార్‌నాథ్ ఉత్తరాఖండ్‌లో ఉంది. హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న ఈ ఆలయాన్ని మే నుంచి సెప్టెంబరు(వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ బహుళ చతుర్దశి) వరకు తెరిచి ఉంచుతారు. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 11, 760 అడుగుల ఎత్తులో ఉంది. 

కేదార్‌నాథ్ క్షేత్రానికి చేరుకోవాలంటే ఢిల్లీ వరకు రైల్లో వెళ్లి అక్కడి నుంచి రోడ్డుమార్గాన హరిద్వార్, దేవప్రయాగ, రుద్ర ప్రయాగ మీదుగా రాంపూర్ చేరాలి. రాంపూర్ నుంచి సోన ప్రయాగ మీదుగా గౌరీకుండ్ చేరాలి. 

ఈ గౌరీకుండ్ గౌరీమాత జన్మస్థలం అని చెబుతారు. కేదార్‌నాథ్ పర్యాటకులు ఇక్కడ వేడినీటి కుండాలలో స్నానమాచరించి గౌరీమాతను దర్శించుకుని కేదార్‌నాథ్ పర్యటనను కొనసాగిస్తారు. గౌరీకుండ్ నుంచి కేదార్‌నాథ్ సుమారు 13 కి.మీలు ఉంటుంది. కాలి నడకన కాని, గుర్రాల మీద లేదా డోలీల్లో ప్రయాణించవచ్చు. వాతావరణాన్ని తట్టుకోవడం కొంచెం కష్టమే. విపరీతమైన చలి, అప్పుడప్పుడూ శ్వాసలో ఇబ్బందులు తలెత్తుతాయి. 13 కి.మీల దూరం ప్రయాణించడానికి ఏడెనిమిది గంటలు పడుతుంది. యాత్రికులు కేదారనాథుడి మీద నమ్మకంతో యాత్ర సాగిస్తారు. 

కేదారేశ్వర జ్యోతిర్లింగానికి భక్తులు స్వయంగా అభిషేకం చేయవచ్చు. ఆలయానికి వెనుకవైపున జగద్గురువు ఆదిశంకరాచార్యుల సమాధి ఉంది. సాధువులు ఒళ్లంతా విబూది పూసుకుని సంచరిస్తుంటారు. ఆధ్యాత్మిక వికాసానికి, పర్యాటక ఆహ్లాదానికి చక్కని వేదిక కేదార్‌నాథ్. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top