పిల్లలతో ఆనందంగా గడిపేస్తూ... హాయిగా ఉన్న ఆమె వైవాహిక జీవితంపై ఎలాంటి ఫిర్యాదులూ లేవు. అయితే, మళ్ళీ బాలీవుడ్లో ఎప్పుడు కనిపిస్తారంటూ కనిపించినవాళ్ళంతా అడిగే ప్రశ్నకు జవాబివ్వలేక పాపం కరిష్మా కపూర్ అలసిపోయింది.
ఈ మధ్య ఢిల్లీలో జరిగిన ఒక చర్మ సౌందర్య ఉత్పత్తి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కరిష్మాకు మీడియావారు కనిపించగానే పాపం తన గోడు ఇలా వెళ్ళబోసుకుంది. ''ఉన్నదున్నట్టు చెప్పాలంటే... మీరు (మీడియా) కనిపించినప్పుడల్లా అడిగే ఈ ప్రశ్నకు జవాబివ్వలేక విసుగొస్తోంది. మళ్ళీ సినిమాలోకి ఎప్పుడొస్తారు? అంటూ ఒకే ప్రశ్న అడుగుతుంటారు. నేను ఇక్కడే ఉంటాను. సినిమా చెయ్యాలని అనుకున్నప్పుడు అందరికీ చెబుతాను''
''నేను మీడియాకు దూరంగా ఉన్నానని మీరంతా అనుకుటున్నారు. అయితే నా పిల్లలతో నాకు క్షణం కూడా తీరిక ఉండటం లేదు. దానికి తోడు ప్రమోషనల్ కార్యక్రమాలున్నాయి. బుల్లి తెరమీద కూడా కనిపించాను. నేను ఇక్కడే చురుకుగా ఉన్నాను'' అని కరిష్మా వివరణ ఇచ్చుకుంది.
ఈ కార్యక్రమంలో తెల్లటి గౌనులో దర్శనమిచ్చిన 36 ఏళ్ళ కరిష్మా... తాను సరైన సమయంలో సినీ పరిశ్రమకు వచ్చానని మహిళా ప్రధానమైన 'బీవీ నెంబర్ 1, జుబేదా, శక్తి' లాంటి సత్తా ఉన్న పాత్రలు దక్కాయని సంతృప్తి వ్యక్తం చేసింది.
ఇక కరిష్మా కుటుంబ జీవితానికి వస్తే... పిల్లలు పుట్టిన తర్వాత లావయ్యే చాలామంది తల్లులకు ఆమె ఆదర్శం. లావుకాకుండా చాలా శ్రమించాల్సి వచ్చిందట. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్ కపూర్ను పెళ్ళాడిన కరిష్మాకు ఇద్దరు పిల్లలు. కూతురు సమైరాకు ఐదేళ్ళు, ఏడాది నిండని కొడుకు కియాన్.
కరిష్మా చెల్లెలు కరీనా మన దేశంలో 'జీరో సైజ్'కు ప్రతిరూపంగా ఉంటే... అక్క మాత్రం సాదా జీవితమే సో బెటర్ అంటుంది.
''నేను పాస్తా, అన్నం, రోటీలు లేదా పిజ్జాలు ఇలా అన్నీ తింటాను... అయితే తగిన పరిమితిలోనే సుమండీ. జిమ్కి వెళతాను. రన్నింగ్, జాగింగ్ అంటే ఇష్టం. నన్ను ఎప్పుడు చలాకీగా ఉంచే నా పిల్లలే నాకు డీటాక్స్ యంత్రాల్లాంటివాళ్ళు'' అని చెప్పింది.