కళ్లు చెదిరే కాంబినేషన్


రజనీకాంత్.... సముద్రంలా కనిపించే నది. కమల్‌హాసన్... నదిలా కనిపించే సముద్రం. ఇక ఇద్దరూ కలిస్తే వెండితెరపై సునామీ. ‘అంతులేని కథ, అందమైన అనుభవం, వయసు పిలిచింది, పాటగాడు, ఎత్తుకు పై ఎత్తు’ తదితర తెలుగు చిత్రాల్లో, ‘పదినారు వయదినిలే, అపూర్వ రాగంగళ్’ వంటి తమిళ చిత్రాల్లో కలిసి నటించారు రజనీకాంత్, కమల్‌హాసన్. కెరీర్ ఆరంభంలో ఈ విధంగా కలిసి నటించిన రజనీ, కమల్‌లు విడివిడిగా స్టార్‌డమ్ తెచ్చుకున్న తర్వాత ఎవరి సినిమాలతో వారు బిజీ అయ్యారు.

అయినప్పటికీ వీరి కాంబినేషన్‌లో సినిమా చేయడానికి పలువురు దర్శకులు ప్రయత్నాలు చేశారు. కానీ సాధ్యపడలేదు. ఇక ఈ కాంబినేషన్ కలవాలంటే వారి గురువు ‘కె.బాలచందర్’ రంగంలోకి దిగాల్సిందేనని, ఆయన ఒక్కడి వల్లే అది సాధ్యమవుతుందని చాలామంది అభిప్రాయపడ్డారు కూడా. కానీ బాలచందర్ మాత్రం.. ‘ఇప్పుడు ఈ హీరోలతో సినిమా చేయలేను. ఒకప్పుడు వాళ్లకు ఇమేజ్ ఉండేది కాదు. నేను అల్లుకున్న కథలుతో వారితో సినిమాలు చేశాను. ఇప్పుడు వాళ్ల ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమా చేస్తే.. నా కథ కిల్ అవుతుంది’ అని ఓ సందర్భంలో పేర్కొన్నారు.

దాంతో ఈ సూపర్‌స్టార్ల కలయికలో ఇక సినిమా వచ్చే అవకాశం లేదని చాలామంది ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడా అభిప్రాయాన్ని మార్చుకోవచ్చని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రముఖ దర్శకుడు శంకర్ వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా చేయడానికి కథ తయారు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్‌లో పెద్ద బేనర్‌గా వెలుగుతున్న ‘సన్ పిక్చర్స్’ ఈ చిత్రాన్ని నిర్మించనుందట. ఈ చిత్రాన్ని దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించడానికి కళానిధి మారన్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

ఇటీవలే రజనీకాంత్‌తో ‘రోబో’లాంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించారు శంకర్. ఈ చిత్రానికి అయిన బడ్జెట్ 200 కోట్లకు పైనే అనే వార్తలు అందాయి. ‘రోబో’ను నిర్మించిన సన్ పిక్చర్స్ ఇప్పుడు రెట్టింపు బడ్జెట్‌తో రజనీ, కమల్, శంకర్ కాంబినేషన్‌లో సినిమా ప్లాన్ చేస్తోంది కాబట్టి ఇది కచ్చితంగా ‘రోబో-2’ అయ్యుంటుందని పరిశీలకులు అంటున్నారు. ఏమైనా ఈ ‘కళ్లు చెదిరే కాంబినేషన్’లో సినిమా వస్తే ప్రేక్షకులకు కనువిందు అని చెప్పొచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top