మీ అరచేతిని టచ్ స్క్రీన్గా వినియోగించేలా సరికొత్త మొబైల్ ఫోన్ను జర్మనీలోని పాట్స్డామ్ యూనివర్శిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఈ సరికొత్త మొబైల్ ఫోన్ను జేబులో ఉంచి అరచేతిని టచ్స్క్రీన్లా వాడుతూ ఫోన్ను వినియోగించవచ్చు. పాట్రిక్ బౌడిచ్ తన తోటి ఉద్యోగులతో కలిసి పనిచేస్తుండగా ఆయన స్మార్టు ఫోన్ రింగ్ అయింది. వెంటనే అతను చేతులు శుభ్రం చేసుకొని చేతి వేళ్ల సాయంతోనే రిమోట్ ఆధారంగా మాట్లాడారు. ఈ ఫోన్లో డెప్త్ సెన్సిటివ్ కెమేరా ఉంటుంది.
చేతి వేళ్ల కదలికల ఆధారంగా జేబులో ఉన్న ఐ ఫోన్ ఐకాన్లు కదిలేలా సాఫ్ట్వేర్ను రూపొందించారు. మైక్రోసాఫ్ట్ కినెక్ట్ మోషన్ సెన్సింగ్ గేమింగ్ విధానం టెక్నాలజీ సాయంతో ఈ ఫోన్ పనిచేస్తుందని జర్మన్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. చేతివేళ్ల సాయంతో పనిచేసే ఈ ఫోన్కు సిగ్నల్ కంప్యూటర్ అనుసంధానం ద్వారా సెల్ఫోన్కు సంకేతాలు వెలువడనున్నాయి. మరింత సమర్ధంగా పనిచేసేందుకు వీలుగా ఈ ఫోన్ ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అరచేతినే టచ్స్క్రీన్లా వాడే ఫోన్లు మన దేశంలోనూ త్వరలో అందుబాటులోకి రావచ్చు.
మాటలతో ఛార్జింగ్!
ముందడుగు వేస్తున్న శాస్త్రసాంకేతిక ప్రగతితోపాటు మీ మాటలతోనే మీ మొబైల్ ఫోన్ బ్యాటరీని ఛార్జింగ్ చేసే కొత్త ప్రక్రియను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ధ్వనిని విద్యుత్తుగా మార్చనుంది. మీరు మొబైల్ ఫోన్ మాట్లాడుతున్నపుడు మీ మాటలే విద్యుత్తులాగా పనిచేసి, మొబైల్ ఛార్జింగ్ అవుతుంది. మీ పర్సనల్ మ్యూజిక్ ప్లేయర్, ఐపాడ్లతోపాటు మీరు ఇష్టంగా పాడుకునే పాటలు కూడా మీ మొబైల్ ఛార్జింగ్కు దోహదం చేస్తాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.
స్పీకర్ల ద్వారా వచ్చే ధ్వని ఆధారంగా ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫాం సిగ్నల్తో ఛార్జింగ్ అవుతుందని దక్షిణ కొరియాకు చెందిన సీయోల్కు చెందిన సుంగ్క్యాన్క్వాన్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ సంగ్ వూ కిమ్ చెప్పారు. ధ్వనిని గ్రహించే పరికరాలతో విద్యుత్తు ఉత్పత్తి సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. త్వరలో మన దేశంలోనూ ధ్వనితోనే ఛార్జింగ్ అయ్యే మొబైల్ ఫోన్లు వస్తాయని ఆశిద్దాం.