వేసవి కాలం వచ్చేసింది. ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి, అధిక దాహాన్ని నియంత్రించడానికి కొన్ని పానీయాలు చక్కగా సహాయపడతాయి. అందులో కొబ్బరి నీళ్లు ఒకటి.
కొబ్బరి నీళ్లు సహజసిద్ధమైన ఎనర్జీ డ్రింక్గా పరిగణించబడతాయి. ఇవి తక్కువ క్యాలరీలతో ఉండటమే కాకుండా, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తాయి.అయితే, మధుమేహం ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగవచ్చా? అని చాలామంది సందేహపడతారు.
వాస్తవానికి, మధుమేహం ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగవచ్చు, కానీ పరిమితంగా మాత్రమే. కొబ్బరి నీళ్లు తక్కువ క్యాలరీలతో, సహజ చక్కెరలతో ఉంటాయి. పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతాయి.
అంతేకాదు, కొబ్బరి నీళ్లు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంటాయి. అందుకే మధుమేహం ఉన్నవారు రోజుకు అర గ్లాసు వరకు తాగవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. తాజా కొబ్బరి నీళ్లను మాత్రమే తాగాలి, ఎందుకంటే ప్యాకెట్ కొబ్బరి నీళ్లలో చక్కెర కలిపి ఉండే అవకాశం ఉంది.
అధిక వేడి వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, కొబ్బరి నీళ్లు తాగితే శరీరం చల్లబడుతుంది. ఇవి శరీరానికి తగిన తేమను అందించి, వేడిదెబ్బ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలసట, నీరసం ఎక్కువగా అనిపించినప్పుడు కొబ్బరి నీళ్లు తాగితే త్వరగా కోలుకోవచ్చు.
కొబ్బరి నీళ్లు కొవ్వును కరిగించడంలో, జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. తక్కువ క్యాలరీలు కలిగి ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఒక మంచి పానీయం.
అంతేకాకుండా, కొబ్బరి నీళ్లు మూత్రాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు సహజ మూత్రవిసర్జన ద్రవంగా పనిచేస్తాయి. మూత్ర మార్గ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ డి చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుస్తాయి.