మహా భాగవతంలో గర్భంలోని శిశువు దశలన్నీ చాలా వివరంగా ఆధునిక వైద్యశాస్త్రం వివరించిన విధంగానే ఉన్నాయి. ఇవే కాకుండా కొన్ని ఆధ్యాత్మిక విశేషాలు కూడా మూడో స్కంధంలో ఉన్నాయి. ఆ స్కంధం ప్రకారం, గర్భస్థ శిశువులో నాలుగు మాసాలు పూర్తి అయ్యేసరికి సప్తధాతువులు ఏర్పడతాయి. ఆకలి, దృష్టి కలుగుతాయి. ఆరు మాసాలకు ఆ పిండాన్ని మావి ఆవరిస్తుంది.
కడుపులో కుడివైపుగా పిండం కదులుతూ ఉంటుంది. ఏడో నెలలో గ త జన్మలు, కర్మలు, అతని స్మరణకు వస్తాయి. తాను మాయచే ఈ లోకంలో బంధించబడుతున్నట్లు తెలుసుకుంటాడు. తల్లి తిన్న ఆహారమే తన శరీరంలో వేడిని కలిగించి, ధాతువుల్ని వృద్ధిపరుస్తుంది. ఆమె తిన్న ఉప్పు పులుపు, కారం అతనికి చాలా వేదన కలిగిస్తాయి. మావిచేత చుట్టబడి, పంజరంలో బంధించబడిన పక్షివలె చేష్టలుడిగి ఉంటాడు. సుఖ దుఃఖాలు తెలుస్తుంటాయి. జ్ఞానం కలుగుతూ ఉంటుంది. లోపల వీచే ప్రసవ వాయువుల వల్ల దుఃఖం కలుగుతుంది. భయపడిపోయి తనకీ గర్భవాసం అనే నరకం మరోసారి కలుగచేయవద్దని భగవంతుని ప్రార్థిస్తాడు. పుట్టడం తనకు ఇష్టం లేకపోయినా. ప్రసూతి వాయువు అతన్ని తల్లిగర్భం నుంచి వెలుపలికి తోసేస్తుంది. జ్ఞానం పోయి అజ్ఞానం ఆవరించి ఏడుస్తాడు.