భారతదేశంలో ఉన్న ప్రసిద్ధపర్యాటక, తీర్థక్షేత్రాలలో హరిద్వార్ ఒకటి. గంగానది హిమాలయ పర్వతాల నుంచి కిందికి దిగిన చోటు ఇది. శివాలిక్ పర్వతాలు ప్రారంభమైన ప్రదేశం. ఇక్కడ ఉన్న ‘హరికిపౌరి’ స్నానఘట్టం అత్యంత ప్రసిద్ధి. ‘ఈ స్నానఘట్టంలో హరిపాదాలు ఉన్నాయి’ అని చెబుతారు. హరిద్వార్ అందాలు వర్ణనాతీతం.
ఢిల్లీ నగరానికి 240 కి.మీ దూరంలో ఉన్న హరిద్వార్లో ‘హరికిపౌరి’, గౌఘాట్, కుషాఘాట్, మానసాదేవి మందిరం, బోళాగిరి, విల్కేశ్వర మహాదేవుడు, శర్వానాథ్, చండీ, మాయాదేవి ఆలయాలు ఉన్నాయి. అలాగే గీతాభవనం, సప్తసరోవరాలు, పరమార్థ ఆశ్రమం, దక్షప్రజాపతి, గోరఖ్నాథ్, అయ్యప్ప, కాలభైరవ, హనుమాన్ దేవాలయాలు కూడా దర్శనమిస్తాయి. గంగానది ప్రవాహవేగం ఇక్కడ చాలా ఎక్కువ. గంగానది ఒడ్డున గంగామాత ప్రసిద్ధ మందిరాలు ఉన్నాయి. ఇక్కడ రోజూ సాయంత్రం వేలాదిమంది భక్తుల సమక్షంలో గంగామాతకు హారతి ఇస్తారు.