దేశ టెలికం రంగంలో విప్లవం తీసుకొచ్చిన రిలయన్స్ జియో మరో సంచలనానికి తెర తీస్తోంది. ఇప్పటికే బ్రాండ్ బ్యాండ్ సర్వీసుల్లోకి రాబోతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. వచ్చేది జియో అంత సంచలనంగా ఉండాలని భావిస్తోంది రిలయన్స్. ప్రతి ఇంటికి 100 MBPS స్పీడ్ తో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ ను అందించేందుకు సిద్ధమౌతోంది. రెండు నెలల్లో జియో బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ వచ్చేస్తాయంటున్నారు కంపెనీ వర్గాలు. స్టార్టింగ్ లో జియో 4జీ స్పీడ్ ను ఉచితంగా అందించిన సంగతి తెలిసిందే. స్వల్ప రీఛార్జ్ తో మరో మూడునెలలు ఈ ఉచిత సర్వీసులను పెంచి.. ప్రత్యర్థి కంపెనీలకు దడ పుట్టించింది. ఇప్పుడు కూడా అదే ఫార్ములాతో మార్కెట్ లోకి లాంఛ్ కాబోతున్నట్లు సమాచారం.
ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలతో ఇతర కంపెనీలకు షాక్ ఇవ్వబోతోంది. రిలయన్స్ జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ తీసుకుంటే.. మొదటి మూడు లేదా ఆరు నెలలు ఫ్రీ అనే ఆఫర్ ప్రకటించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫ్రీ ఆఫర్ లేకపోతే ప్రస్తుత మార్కెట్ లో నిలబడటం.. జనం దగ్గరకు వెళ్లటం కష్టం అనే విషయం రిలయన్స్ కు బాగా తెలుసు అని కూడా అంటున్నారు నిపుణులు. రిలయన్స్ జియో ఫైబర్ స్పీడ్ సెకన్ కు 1 GB ఇస్తామని గతంలో ప్రకటించింది జియో. 2016 సెప్టెంబర్ లో ముంబై, పూనేలోని రెసిడెన్షియల్ సొసైటీలకు GB పెర్ సెకండ్ ట్రయల్ రన్ లో భాగంగా అందించింది.