పాదాల సంరక్షణ మీద దృష్టి పెట్టకపోతే.. మృతకణాలు పేరుకుపోయి రంగు మారిపోతాయి. మరి ఇబ్బంది పెట్టే ఈ సమస్య నుంచి బయటపడటానికి ఏం చేయాలంటే..
- పాదాల సంరక్షణలో భాగంగా సాక్సులు వాడుతుంటారు చాలామంది. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరిచి ధరించాలి. లేదంటే దుమ్ము, మురికి చేరిపోయి చెమట పట్టినప్పుడు పాదాలకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. అలానే నైలాన్ సాక్సుల కంటే కాటన్వి సౌకర్యంగా ఉంటాయి. రాత్రిపూట తప్పనిసరిగా గోరువెచ్చటి నీళ్లతో కాళ్లు కడుక్కొని పొడి తువాలుతో తుడిచి కొబ్బరి నూనె రాయాలి. కొద్దిసేపు పాదాలను మునివేళ్లతో నొక్కుతూ ఉంటే రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. మర్నాటికి పాదాలు మెత్తబడతాయి.
- ముల్తానీ మట్టిలో గులాబీనీరు కలిపి పాదాలకు పూత వేసి.. పావుగంటయ్యాక కడిగి మాయిశ్చరైజర్ రాయాలి. తరచూ ఇలా చేయడం వల్ల చర్మం మీద మృతకణాలు తొలగిపోయి.. మృదువుగా మారతాయి. గులాబీ నీళ్లు, గ్లిజరిన్ సమపాళ్లలో తీసుకొని పాదాలకు మర్దన చేయాలి. మర్నాడు గోరువెచ్చటినీళ్లలో షాంపూ కలిపి కడిగితే.. పాదాల మీద మురికి సులువుగా తొలగిపోతుంది.
- బంకమట్టిలో పావుగంటపాటు నడవడం వల్ల చర్మసంబంధిత సమస్యలు దూరమవుతాయి. కనీసం పదిహేను రోజులకోసారి ఇలా చేయడం మంచిది. దీన్ని స్పాలో మడ్ థెరపీ అంటారు. ఇదికాక మరోపద్ధతి వేపాకులను మెత్తగా నూరి అందులో చెంచా పసుపు కలిపి పాదాలకు పూత వేయడం.. అది ఆరాక షాంపూతో రుద్ది కడిగితే కోమలంగా మారతాయి. పగుళ్ల సమస్య కూడా తగ్గిపోతుంది.
- రెండు చెంచాల నువ్వుల నూనెలో చెంచా తేనె కలిపి మర్దన చేసి పదినిమిషాలయ్యాక గోరువెచ్చటి నీళ్లతో నానబెట్టి కడిగేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. వీలుంటే గోరింటాకును మెత్తగా రుబ్బి అందులో పసుపు కలిపి మడమలు, అరికాళ్లకు పెడితే... శరీరంలోని వేడి బయటకు వస్తుంది. పాదాలు పగుళ్లకు దూరంగా ఉంటాయి.
- రెండు బంతిపువ్వులను తీసుకొని వాటి రెబ్బలను మెత్తగా ముద్ద చేసి అందులో కొద్దిగా బొప్పాయి గుజ్జు చేర్చి పూతవేయాలి. బంతిపువ్వులు చర్మానికి హాని చేసే ఇన్ఫెక్షన్లను దరిచేరనీయవు.
- గట్టిగా చర్మానికి పట్టి ఉండే చెప్పులు ధరించడం వల్ల పాదాలు పాడైపోతాయి, అవి మెత్తగా ఉండేలా చూసుకోవాలి. తడిలో ఎక్కువ సేపు పని చేశాక పాదాలను మెడికేటెడ్ సబ్బుతో రుద్ది కడగాలి. అప్పుడు ఎలాంటి సమస్యలూ తలెత్తవు.