మండు వేసవి వచ్చేసింది. ఈ వేసవిలో చల్లని పానీయంలా మంచి చిత్రాలకోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆ సేద తీర్చడానికి వేసవిలో ముగ్గురు అగ్ర హీరోలు తమ చిత్రాలతో ప్రేక్షకుల కోసం ముందుకు వస్తున్నారు. వాటిలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం ‘శక్తి’, పవన్కళ్యాణ్ ‘తీన్మార్’, ప్రభాస్ నటించిన ‘మిస్టర్ పెర్ఫెక్ట్’ చిత్రాలు ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు వేసవి కానుకగా తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ మూడు చిత్రాల మీద అంచనాలు కూడా బాగా వున్నాయి. ఈ మూడు చిత్రాల్లో ఏ చిత్రం విజయం సాధిస్తుంది? లేక మూడు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయా అనే తర్జనభర్జనలు టాలీవుడ్లో సాగుతున్నాయి. ఈ మూడు చిత్రాల విశేషాలను గమనిద్దాం.
శక్తి:-
జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా ప్రధాన ఆకర్షణగా వస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. కాళీమాత శక్తి పీఠాల నేపథ్యంగా ఈ చిత్ర కథ నడుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు విడుదలయ్యాయి. మణిశర్మ అందించిన పాటలు విశేష ప్రజాదరణ పొందుతున్నాయని దర్శక నిర్మాతలు చెప్పడం విశేషం. భారతదేశంలోని ఎన్నో ప్రదేశాల్లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ను చేసారు. కుంభమేళాలో తొలిసారిగా షూటింగ్ చేసిన చిత్రం ‘శక్తి’. దాదాపు 50 లక్షల మంది భక్తుల మధ్య ఈ చిత్రం షూటింగ్ సరికొత్తగా చేసామని దర్శకులు చెబుతున్నారు. పైగా ఈ చిత్రం షూటింగ్కి దాదాపు 13 నెలలు పట్టినట్లు తెలుస్తోంది. జాకీష్రాఫ్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మంజు భార్గవి లాంటి అరుదైన నటులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషించారు. జూనియర్ ఎన్టీఆర్ దాదాపు ఐదు రకాల గెటప్స్తో ఈ చిత్రంలో ప్రేక్షకులకు కనువిందుచేయనున్నారు. ఈ ఐదురకాల వేషాలు చిత్రానికి హైలెట్గా ఉంటాయని తెలుస్తోంది. తెలుగుతోపాటు, తమిళంలో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో గతంలో వచ్చిన చిత్రం విజయవంతమైన నేపథ్యంలో ఎన్టీఆర్, ఇలియానా కాంబినేషన్లో ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందని ప్రేక్షకుల అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో త్వరలోనే తెలుస్తుంది.తీన్మార్:
పవన్కళ్యాణ్, త్రిష జంటగా జయంతి సి.పరాన్జీ దర్శకత్వంలో నిర్మాణమైన చిత్రం ‘తీన్మార్’. ఈ చిత్రంలో పవన్ తన అభిమానులకు నచ్చే విధంగా కూల్గా, ఓరేంజ్ రఫ్గా కనిపించే పాత్రలో నటించారు. పవన్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఈ చిత్రం రూపొందింది. టైటిల్నిబట్టి ఈ చిత్రం హుషారుగా, వినోదంగా ఉంటుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మైసూర్ మరియు విదేశాలలో పాటలు చిత్రీకరించుకున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్న మాటలు ప్లస్ పాయింట్గా మారాయి. శక్తివంతమైన డైలాగ్స్, వినోదంగా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తాయని నిర్మాత చెబుతున్నారు. పవన్, త్రిష తొలిసారిగా ప్రేక్షకులకు కనువిందు చేయనున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. మిస్టర్ పర్ఫెక్ట్:-
ప్రభాస్ను సరికొత్త లుక్తో కనువిందుచేసే ఈ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో రూపొందింది. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, ఈ చిత్రానికి విజయం తథ్యమని చెబుతోంది. యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకులు చెబుతున్నారు. చిత్రం మొత్తంమీద అద్భుతమైన మూడు ఫైట్స్ను పీటర్ హేన్స్ కంపోజ్ చేశారు. ప్రభాస్, కాజల్ కాంబినేషన్లో గతంలో ‘డార్లింగ్’ చిత్రం కన్నా ఈ చిత్రం ప్రేక్షకులను వందశాతం సంతృప్తిపరుస్తుందని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అంటున్నారు.ఇలా వేసవిలో తమ హీరోలు చిత్రాలు పోటాపోటీగా విడుదలైతే ఎవరు విజేతలో తెలుస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ ఎండాకాలంలో విడుదలవుతున్న ఈ మూడు చిత్రాల్లో విజేత ఎవరో త్వరలో తేలిపోతుంది.