ఉగాది అంటే .....పంచాంగం అంటే .....పంచాంగ శ్రవణ ఫలమేమిటి?

యుగాది అనే సంస్కృత పదానికి యుగానికి ఆది లేక ప్రారంభం అని అర్థం. యుగానికి వికృతరూపమే ఉగము. ఈ ఉగము నుంచి పుట్టినదే ఉగాది. ప్రాచీన కాలంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, తరువాత మార్గశిర శుద్ధపాడ్యమి, ఆ తర్వాత చైత్రశుద్ధ పాడ్యమి... ఈ మూడింటినీ ఉగాదిగా జరుపుకునేవారని పురాతన గ్రంథాల ద్వారా తెలుస్తోంది. తెలుగు వారిది, కన్నడిగులది చాంద్రమానం. కేరళ, తమిళనాడు రాష్ట్రాలవారిది సౌరమానం. మనం జరుపుకునే పండుగలు, చే సే శుభకార్యాలు, చెప్పుకునే సంకల్పాలన్నీ చాంద్రమానం ప్రకారమే! ఈ పండుగలో దాగి ఉన్న విశేషాలేమిటో ఒకసారి పరిశీలిద్దాం.

మనకు జ్యోతిష శాస్తర్రీత్యా శుభాశుభ ఫలితాలను తెలిపే పండుగ ఉగాది. దీనినే సంవత్సరాది అని కూడా అంటారు. ఉగాది నుంచి తెలుగు వారికి కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. నిన్న మొన్నటి వరకు ఉన్న సంవత్సరం వికృతి కాగా ఈ ఉగాది నుంచి ఖర నామ సంవ త్సరంలోకి అడుగు పెడుతున్నాం. రైతులు, రాజకీయనాయకులు, ఉపాధ్యాయులు, కళాసాంస్కృతిక రంగాలవారు, సినీనటులు, ఉపాధ్యాయులు, వివిధ రకాల వృత్తులు, ఉద్యోగాలలో ఉండే వారంతా ఈ సంవత్సరం తమ రాశిఫలాలు లేదా నామనక్షత్ర ఫలాలు ఏ విధంగా ఉన్నాయో పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకుంటారు.
ఆరోగ్యాన్నిచ్చే అభ్యంగనం
ఉగాది వంటి పర్వదినాలలో నువ్వులనూనెలో లక్ష్మి, జలంలో గంగాదేవి ఉంటారనిశాస్త్రోక్తి. కాబట్టి మామూలు రోజులలో ఎలా స్నానం చేసినా, దానిని కాస్త పక్కనపెట్టి ఉగాదినాడు పొద్దున్నే లేచి అభ్యంగన స్నానం చేయాలి. అంటే ఒళ్లంతా నువ్వుల నూనె, సున్నిపిండి పట్టించి, కుంకుడురసం లేదా సీకాయపొడితో తలారా స్నానం చేయాలి. అనంతరం నూతన వస్ర్తాలు లేదా శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించి, నిత్యకర్మానుష్ఠానాలు ముగిసిన అనంతరం బంధుమిత్రులతో కలిసి భోజనం చేసి, పంచాంగ శ్రవణం చేయాలి. 


శుభ్రమైన దుస్తులు శుభప్రదం
ఈరోజున చిరిగిన, మాసిన లేదా విడిచిన బట్టలు ధరించిన వారికి, తలస్నానం చేయని వారికి సంవత్సరమంతా రకరకాల వ్యాధులు, దారిద్య్రబాధలు సోకుతాయని శాస్త్రోక్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉగాదినాడు వీలయితే నూతన వస్ర్తాలు లేదా చిరుగులు పడని, శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించడం శ్రేయోదాయకం. తెల్లటి దుస్తులు ధరించడం శుభప్రదర .
ఉగాది సంప్రదాయం
ఈ పర్వదినాన ఉదయమే ఇల్లు అలికి, ముగ్గుపెట్టి లేదా అటకలతో సహా అన్నిగదులలోనూ బూజు దులిపి ఊడ్చి, శుభ్రంగా కడుక్కుని, మామిడి లేదా వివిధ రకాల పుష్పాలతో తోరణాలు కట్టాలి. గడపలకు పసుపు, కుంకుమలు అలంకరించాలి. ఇంటిలో మనం పూజించే ఇష్టదేవతల విగ్రహాలను షోడశోపచారాలతో పూజించి, శుచిగా చేసిన పిండివంటలను, ఉగాది పచ్చడిని నివేదించాలి.
పంచాంగం అంటే ...
తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు భాగాలను కలిపి పంచాంగం అంటారు. తిథి వలన సంపద, నక్షత్రం వల్ల పాపపరిహారం, సరైన యోగంతో వ్యాధి నివృత్తి, కరణం ద్వారా కార్యానుకూలతను పొందవచ్చు. కాబట్టి చేసే పనులలో అనుకూలతను, జయాన్ని కాంక్షించేవారందరూ, కాలాన్ని తెలిసి కర్మలు చేసేవారందరూ తప్పక పంచాంగం చూడాలి.
పంచాంగ శ్రవణ ఫలమేమిటి?

ఉగాదినాటి పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలంతో సమానమట. అదొక్కటే కాదు, పంచాంగ శ్రవణం... భూమి, బంగారం, ఏనుగులు, గోవులతో కూడిన సర్వలక్షణ లక్షితమైన కన్యను వేదవిదుడైన బ్రాహ్మణునకు లేదా యోగ్యుడైన వరునకు దానం చేస్తే కలిగే ఫలంతో సమానమైన ఫలాన్నిస్తుందని శాస్త్రోక్తి. అంతేకాదు, సంవత్సరానికి అధిపతులైన రాజాది నవనాయకుల గ్రహఫలితాలను శాస్త్రోక్తంగా వినడం వల్ల గ్రహదోషాలు నివారించబడి, వినేవారికి ఆరోగ్యాన్ని, యశస్సును, ఆయుష్షునూ వృద్ధి చేసి, సంపదతో కూడిన సకల శుభఫలాలనూ ఇస్తుందట. కాబట్టి ఉగాదినాడు పంచాంగ ఫలాలను తెలుసుకోవడం వల్ల భవిష్యత్ కార్యాచరణను చేపట్టవచ్చు.
ఆరు రుచులలో అనేక అర్థాలు
ఉగాదికి సంకేతంగా చెప్పుకునే ఆరురుచుల కలయికలో అనంతమైన అర్థముంది. ప్రకృతి లేనిదే జీవి లేదు. జీవి లేని ప్రకృతి అసంపూర్ణం. కాబట్టి జీవునికి అంటే... మానవునికి, ప్రకృతికి గల అవినాభావ సంబంధాన్ని గుర్తుచేస్తుంది ఈ పండుగ. సరికొత్త ప్రకృతి అందించే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు రుచుల సమ్మేళనంతో తయారయ్చే ఉగాది పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం. జీవితమంటే కేవలం కష్టాలు లేదా సుఖాలే కాదు, అన్ని విధాలైన అనుభవాలూ, అనుభూతులూ ఉంటాయి, ఉండాలి! అలా ఉన్నప్పుడే జీవితానికి అర్థం పరమార్థం. ఈసత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఉగాది పచ్చడి.
వైవిద్యభరితం

కొత్త చింతపండు బదులు బెల్లం, మిరియాలకు మారుగా ఎండుకారం లేదా పచ్చిమిరప వాడుతున్నారు. కొందరు చెరకు ముక్కలు, అరటిపండు ముక్కలు, గసగసాలు, సోంపు... ఇలా ఎవరి అభిరుచి, అలవాటు లేదా ఆచారాన్ని బట్టి ఉగాది పచ్చడి తయారుచేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో దీనిని పచ్చడిలా గట్టిగా చేస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాలలో కొత్తకుండలో పోసి, ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు, అతిథులకు ఇవ్వడం ఆనవాయితీ. రోజున ఉపవాసం ఉండి బ్రహ్మదేవుని పూజించిన వారికి సంవత్సరమంతా సుఖసంతోషాలు లభిస్తాయని శాస్త్రోక్తి. వర్షాలు బాగా కురవాలని కోరుతూ వ్యవయసాయదారులు ఈ వేళ ఇంద్రుణ్ణి పూజించడం కొన్ని ప్రాంతాలలో కనిపించే ఆచారం.
ప్రాచీనం నుంచి ఆధునికం దాకా!
ప్రపంచంలో ఎక్కువ పూలు వికసించేది, పండ్లలో రాజయిన మామిడిపండు విరివిగా లభించేదీ, పరమశివునికి అత్యంత ప్రీతికరమైన కుందపుష్పాలు అంటే మల్లెపూలు పూసేదీ, ఆమని పాడేదీ వసంత రుతువులోనే! అందుకనే ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు వసంత ఋతువర్ణన చేయని కవులు, రచయితలు లేనే లేరంటే అతిశయోక్తి కాదు.
సంప్రదాయమే ముద్దు...

పాశ్చాత్య సంస్కృతి మనదేశంలో ప్రవేశించిన తర్వాత తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాదితోనే ఆరంభమవుతుందన్న విషయాన్ని మరచి జనవరి 1వ తేదీనే నూతన సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. అందులో తప్పేమీ లేకపోయినప్పటికీ, మన మూలాలను మరవడం మాత్రం క్షంతవ్యం కాదు. కాబట్టి వేడుకలు, కవి సమ్మేళనాలు చేసుకోకపోయినా, ఉగాది సంప్రదాయం మేరకు పాత కక్షలు, కార్పణ్యాలు మరచి ఒకరితో ఒకరు అన్యోన్యంగా, సుఖసంతోషాలతో గడపాలి.
నూతనత్వానికి నాంది
బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినదీ, ప్రజానురంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శకకారుడైన శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిష్ఠించిందీ ఉగాదినాడేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి నూతనకార్యాలు ప్రారంభించడానికి ఉగాదిని మించిన శుభతరుణం మరొకటి లేదనే కదా అర్థం.
    
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top