ఏడాది పొడవునా ఒకే రకమైన ఆహారం తినే రోజులు పోయాయి. వాతావరణ పరిస్థితులు, వయసు, దైనందిన కార్యకలాపాల ఆధారంగా మన ం తీసుకొనే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మే నెలలో ఉదయం పదింటికల్లా ఎండ పెరిగి, నీరసం వచ్చేస్తుంది. 50 ఏళ్లు దాటిన వారిలో నీరసం బయటకు కనిపిస్తుంది. చిన్నపిల్లలకు బయటకు కనిపించకపోయినా శరీరంలో నీరు ఆవిరైపోయి నీరసపడతారు. ఇలాంటప్పుడు మనం తీసుకొనే ఆహారంలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి.
- ఈ సీజన్లో ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మాంసాహారం తీసుకోనే వారు తక్కువ మసాలాలు వేసి మటన్ తీసుకోవచ్చు. శాకాహారులు ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. గోంగూర, చుక్కకూరల్లో విటమిన్ -సితో పాటు ఐరన్ అధికంగా ఉంటుంది. శరీరంలో ఐరన్ శాతం తగ్గితే త్వరగా నీరసించిపోతారు.
- మనం తీసుకొనే ఆహారంలో తప్పనిసరిగా నిమ్మరసం పిండుకోవాలి. వేసవిలో నిమ్మరసం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
- వేసవి తాపం వల్ల తక్కువ తింటాం. ఫలితంగా మన శరీరానికి అవసరమైనన్ని కార్బోహైడ్రేట్లు అందవు. అందువల్ల హోల్వీట్తో చేసిన పదార్థాలు, వెరైటీగా తయారుచేసుకొని తీసుకోవాలి. సత్వరం ఎనర్జీ ఇచ్చే స్వీట్లు, కూల్డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
- వేసవిలో పెరుగు, మజ్జిగ దివ్యమైన ఔషధాల్లా పనిచేస్తాయి. మనం తీసుకున్న ఆహారంలో ఉండే పోషకవిలువలను సత్వరం శరీరానికి పట్టేలా పెరుగు ఉపకరిస్తుంది. ఫలితంగా సత్వరం శరీరానికి శక్తి వస్తుంది.
- ఓట్స్తో చేసిన పదార్థాలను అల్పాహారంగా తీసుకోవాలి. సత్వరం శక్తి ఇచ్చే పదార్థాల్లో ఓట్స్ ప్రధానమైనది.
- తాజా కూరగాయలు ముఖ్యంగా పొట్ల, సొర, దోస వంటి కూరలు అధికంగా తీసుకోవాలి. ఎక్కువ రోజులు బయట ఉంచిన కూరగాయల్లో నీరు ఇంకిపోతుంది. కాబట్టి వాటివల్ల ఫలితం ఉండదు. ముఖ్యంగా నీరు అధికంగా ఉండే పుచ్చ, తర్బూజ, కీర, టమోటా వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే వేసవి కష్టాల నుంచి సులభంగా బయటపడే వీలుంటుంది.