మనరాష్ట్రంలో ఉన్న వేసవి విడిది ప్రాంతాల్లో అరకులోయ ఒకటి. ప్రశాంతమైన
వాతావరణం, ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ సుందర ప్రదేశం అనంతగిరి
కొండలలో ఉంది. విశాఖపట్టణం నుంచి రైలు, బస్సు మార్గాలు ఉన్నాయి. అరకులోయ
లేదా అరకువేలీ అనే ఈ క్షేత్రానికి రైలులో వెళితే ప్రకృతి అందాలను
ఆస్వాదించవచ్చు. దాదాపు 32 సొరంగాల గుండా కొండలు, జలపాతాల మధ్య ప్రయాణం
ఆహ్లాదకరంగా, రమణీయంగా సాగుతుంది. అరకులోయలో పర్యాటకులకు ఆకట్టుకునేవి
ఇక్కడి జలపాతాలే. ఇవి నిరంతరం ప్రవహిస్తుంటాయి. చూపరులను ఆకట్టుకునే అద్భుత
దృశ్యాలు ఈ అరకులోయ సొంతం. ఇక్కడ ఎక్కువగా గిరిజనులు నివసిస్తారు. మోరి,
తుడుమ్, డప్పు వంటి పరికరాలతో గిరిజనులు చేసే నృత్యాలు పర్యాటకులను
విశేషంగా ఆకట్టుకుంటాయి. అరకులోయలో బస చేయడానికి గెస్ట్ హౌస్లు,
రిసార్ట్స్ అందుబాటులో ఉన్నాయి.