Temple Prasadam :మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం అయ్యాక ప్రసాదం పెట్టటం తప్పనిసరి. ఆ ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా కళ్ళకు అద్దుకొని మరీ తింటారు. అయితే అసలు గుడిలో ప్రసాదం ఎందుకు పెడతారు? ప్రసాదం ఎందుకు తినాలి? అసలు గుడిలో ప్రసాదం పెట్టటం వెనక ఏదైనా పరమార్ధం ఉందా? దీని వెనక ఉన్న రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
మనం ప్రసాదంగా భావించే పదానికి అన్నం,నైవేద్యం అనే అర్ధాలు ఉన్నాయి. అయితే ప్రసాదం అనేది మనస్సును నిర్మలం చేస్తుంది. మనం ప్రతి రోజు ఎంత ఆహారాన్ని తీసుకున్నా సరే, ప్రసాదాన్ని తీసుకొనే సమయంలో మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రసాదం మనస్సును ప్రశాంతంగా ఉంచటమే కాకుండా మనిషిలో కరుణ,చిరునవ్వు కలిగిస్తుంది. అందుకే ప్రసాదం తీసుకొనే సమయంలో మన ముఖం మీద చిరునవ్వు వస్తుంది.
అన్ని దానాలలో కెల్లా అన్న దానం గొప్పదని మన పురాణాలు చెప్పుతున్నాయి. అందుకే దేవాలయాల్లో ప్రసాదాన్ని పెడతారు. ఆలయాల్లో ప్రసాదాన్ని కూడా చాలా పవిత్రంగా తయారుచేస్తారు. చాలా దేవాలయాల్లో పాలు,అన్నం కలిపి ప్రసాదాన్ని తయారుచేస్తారు. దీని వల్ల శక్తి రెట్టింపు అయ్యి అన్నం పరమన్నంగా మారుతుంది. ఇక ప్రసాదంలో వాడే పెసరపప్పు,కొబ్బరి బలాన్ని ఇస్తాయి. అందుకే భక్తి,శక్తి,త్రికరణ శుద్ది కలిగించే ప్రసాదాన్ని తీసుకోవటం అసలు మానకూడదు. మనస్సుకు ప్రశాంతత కలిగించే ఈ అవకాశాన్ని అసలు వదలకూడదు.