ఉప్మాలో చాలా రకాలు ఉన్నాయి. అందులో రాగి పిండి ఆరోగ్యానికి మంచిదని జావా చేసుకుంటాము. పిల్లలు జావా లాంటివి తాగరు. ఇలా మనం డిఫరెంట్ గా ఉప్మా, దోశ అలా చేసుకున్నప్పుడు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో ఇది ట్రై చేద్దాం.
కావలసినవి:
ఒక కప్పు రాగిపిండి , ఒక కప్పు బొంబాయి రవ్వ , ఒక టేబుల్ స్పూన్ పల్లీలు , ఒక టీ స్పూన్ ఆవాలు , ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు , ఒక టీ స్పూన్ మినప గుళ్ళు , ఒక ఇంచు అల్లం, ఐదు పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ,ఒక క్యారెట్ మీడియం సైజు .
చేసే విధానం:
ముందుగా ఒక పాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి కాగిన తర్వాత ఒక కప్పు రాగి పిండిని వేసి అదే కప్పుతో బొంబాయి రవ్వ వేసి మాడకుండా ఒక గరిటతో అంతా కలుపుకుంటూ ఉండండి. రాగి పిండి, రవ్వ కొంచెం కలర్ మారాక పొయ్యి ఆఫ్ చేసేయండి. చల్లారే వరకు పక్కన పెట్టండి.
ఇప్పుడు అదే పాన్లో నాలుగు స్పూన్ల నూనె వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి. పల్లీలు కొంచెం టైం పడతాయి. కాబట్టి అవి కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప గుళ్ళు వేసి ఒకసారి కలుపుకోండి. కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు.
వేగిన తర్వాత అల్లం బాగా చిన్న మొక్కలు లేదా తురిమి వేసుకోండి, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా వేసుకోండి, ఉల్లిపాయ పొడుగ్గా ముక్కలు, క్యారెట్ ముక్కలు అన్ని ఒక దాని తర్వాత ఒకటి వేసుకోండి. క్యారెట్ ముక్కలు మెత్త పడే వరకు చూసుకొని ఆరు కప్పుల నీళ్లు పోసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు మరగనివ్వండి .
ఇప్పుడు వేపిన రాగి పిండి ,బొంబాయి రవ్వ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా పోస్తూ గరిటతో కలుపుకోండి, అంతా కలిపాక ఒక స్పూను నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. కాసేపటికీ చిక్కబడుతుంది .మీకు కావాల్సిన consistency చూసుకొని సర్వ్ చేసుకోండి. అంతే హల్దీ రాగి పిండి ఉప్మా రెడీ.