స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఖాతాదారులకు ఉచిత క్రెడిట్ కార్డులు అందిస్తామని ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ప్రకటించారు. ఖాతాలో రూ. 20 నుంచి రూ. 25 వేల వరకు నిల్వ ఉంచుతున్న వినియోగదారులు ఈ ఉచిత క్రెడిట్ కార్డులను పొందొచ్చని, నాలుగేళ్ల పాటు ఎలాంటి వార్షిక ఫీజు లేకుండా వాడుకోవచ్చని ఎస్బీఐ చీఫ్ తెలిపారు. డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ‘ఉన్నతి’ అనే పథకం ద్వారా ఈ ఉచిత క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
వినియోగదారుడి క్రెడిట్ హిస్టరీతో సంబంధం లేకుండా.. ఖాతాలో రూ. 20 నుంచి రూ. 25 వేల వరకు నిల్వ ఉంచుతున్న వారికి ఈ క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నారు. ఖాతాల్లో కనీస నిల్వలు ఉండాల్సిందేనని ఇటీవల ఎస్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్బీఐ ప్రకటనపై ఖాతాదారుల నుంచి తీవ్రమైన వ్యతిరేక వచ్చింది. ‘మా డబ్బుపై మీ పెత్తనం ఏమిటి?’ అని ఎస్బీఐని నిలదీశారు. ఈ నేపథ్యంలో… వినియోగదారులే ఖాతాల్లో నిల్వలు ఉంచేలా చేసేందుకు ఈ ఉచిత క్రెడిట్ కార్డును ఎస్బీఐ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.