వేసవికాలంతో పాటు పలు రకాల సమ్మర్ సీజనల్ పండ్లు పుచ్చకాయలు, ద్రాక్ష, మామిడిపండ్లు, తర్బూజాలు మార్కెట్లోకి వచ్చాయి. ఈ కాలంలో శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతున్న పండ్ల గురించి తెలుసుకుందాం. వేసవిలో డీహైడ్రేషన్కు గురికాకుండా నివారించేందుకు పుచ్చకాయ ఉపయోగపడుతుంది. పుచ్చకాయల్లో 46 క్యాలరీలుంటాయి. ఇందులో కార్బొహైడ్రేట్లు 4 శాతం, ఫైబర్ 2 శాతం, విటమిన్ ఎ 18 శాతం, విటమిన్ సి 21 శాతం ఉంటాయి. కాల్షియం, ఐరన్ ఉన్న పుచ్చకాయలో కొలెస్ట్రాల్ జీరో శాతం. పుచ్చకాయను మధ్యాహ్నం వేళ తీసుకుంటే మంచిది. ద్రాక్ష కూడా శరీరానికి కావాల్సిన నీటిని అందిస్తుంది. ద్రాక్షను భోజన సమయంలో కాకుండా ఎండలో బయటకు వెళ్లే ముందు తీసుకుంటే మంచిది. ద్రాక్షలో కార్బొహైడ్రేట్లు 3 శాతం, ఫైబర్ 6 శాతం, విటమిన్ ఎ 24 శాతం, విటమిన్ సి 73 శాతం ఉన్నాయి. తర్బూజా కూడా వేసవిలో తినేందుకు అనువైన పండు.
దీన్ని భోజన సమయంలోనూ తినవచ్చు. పండ్లన్నింటిలోనూ రారాజుగా పేరొందిన మామిడిపండు రసాన్ని పాలల్లో కలుపుకొని తాగితే మంచిది. మామిడి ముక్కలకు పంచదార కలుపుకొని తిన్నా ఉపయోగం. మామిడిపండులో అత్యధికంగా 107 క్యాలరీలున్నాయి. కార్బొహైడ్రేట్లు 9 శాతం, ఫైబర్ 12 శాతం, విటమిన్ ఎ 25 శాతం, విటమిన్ సి 76 శాతం, కాల్షియం 2 శాతం, ఐరన్ 1 శాతం ఉన్నాయి. తాజాగా ఉన్న పండ్లను కోసిన వెంటనే తినటం లేదా దాన్ని జ్యూస్గా చేసుకొని తాగటం వల్ల ఆయా పండ్లలోని న్రూట్రిన్లు, ప్రోటీన్లు అందుతాయి. ఈ వేసవిలో కొబ్బరినీరు తాగటం ఆరోగ్యానికి మంచిది. ఎసిడిటీ, అల్సర్ వ్యాధులున్న వారికి కొబ్బరినీరు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఖాళీ కడుపుతో కొబ్బరినీరు తాగకూడదు. ఏదైనా తిన్న తర్వాత కొబ్బరినీరు తాగితే మంచిదని అంటున్నారు పోషకాహార నిపుణులు.