దేవ దానవులు పాలసముద్రాన్ని చిలకసాగారు. అమృతం పుట్టింది. దాన్ని వారందరికీ పంచడానికి శ్రీహరి పూనుకున్నాడు. ముందు దేవతలకు పంచసాగాడు. తమకూ ఇవ్వమని వచ్చి దానవులను కాసేపు ఆగమని చెబుతూ వచ్చాడు. చివరికి అమృతమంతా దేవతలకే సరిపోయింది. దానవులకు లేకుండా పోయింది. ఆ విషయంపై పేద్ద యుద్ధం జరిగింది. అప్పుడో దానవుడు... అమృతం ముందే తీసేసుకోవాల్సింది, అనవసరంగా ఆలస్యం చేశాం, మన ఆలస్యం వల్ల అమృతం పోయి విషం (యుద్ధం) దక్కింది అన్నాడట. అప్పట్నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది. ఆలస్యం చేస్తే అనుకున్న మంచి ఫలితం దక్కకపోగా చెడు జరుగుతుంది అని చెప్పే సందర్భంలో దీన్ని వాడతారు.