బాహుబలి చిత్రం ద్వారా ఆ చిత్రంలో నటించిన నటీనటులకు తెచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. హీరో ప్రభాస్ ఒక్కసారిగా నేషనల్ స్టార్ అయిపోయాడు. తన పారితోషికం కూడా పెంచేశాడు. ఇప్పుడు తమన్నా కూడా ఇదే దారిలో వెళ్తోంది. ఒక్కసారిగా తన పారితోషికం పెంచేసి నిర్మాతలకు షాక్ ఇస్తోంది. తన పారితోషికం విషయంలో అసలు కాంప్రమైజ్ కానని చెబుతోందట.
దీంతో ఆమె కథానాయికగా తెలుగు, తమిళంలో రీమేక్ చేయాలని చూసిన క్వీన్ చిత్రాన్ని పక్కన పెట్టేసారు. తమన్నా డిమాండ్లు తట్టుకోలేక పోతున్నామని, ఆమె అడిగే పారితోషికానికి అసలు వర్కవుట్ అవదని సదరు నిర్మాత దండం పెట్టేశాడు. క్వీన్ రీమేక్ చేయాలని చాలా కాలంగా చూస్తున్నప్పటికీ హీరోయిన్ ఎవరూ సెట్ కాలేదు. ఫైనల్గా తమన్నా ఓకే చెప్పిందనుకుంటే, ఇప్పుడామె ఏమో భారీ పారితోషికం డిమాండ్ చేస్తూ ఇంకా చాలా కండిషన్లు పెట్టిందట. దాంతో తమన్నాని భరించడం తమ వల్లకాదని వేరే హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు.
ఈ చిత్రానికి ఎవరైనా ఇమేజ్ వున్న హీరోయిన్ అయితేనే న్యాయం జరుగుతుంది కనుక స్టార్ హీరోయిన్ ఎవరైనా ఆసక్తి చూపిస్తారేమోనని చూస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు త్రిష, అనుష్క, సమంత తదితరులంతా ఇంట్రెస్ట్ వుందన్నారు కానీ వారెవరితోను మెటీరియలైజ్ అవలేదు. తమన్నా కుదిరిందని ఆనందించే లోపు ఆమె పారితోషికం విషయం లో చెట్టెక్కి కూర్చుంది.


