ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేనప్పుడు కూడా ఈ దోశలు గొప్ప ఎంపికగా చెప్పవచ్చు. రవ్వ దోశల మాదిరిగానే ఇవి క్రిస్పీగా, రుచికరంగా ఉంటాయి. ఇలా తయారు చేసి పెడితే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఈ ఇన్స్టంట్ దోశల తయారీకి కావాల్సిన పదార్థాలు మరియు విధానాన్ని ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- గోధుమపిండి - 1 కప్పు
- బియ్యప్పిండి - ½ కప్పు
- బొంబాయి రవ్వ - ¼ కప్పు
- పెరుగు - ¼ కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- నెయ్యి - 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర, మిరియాల పొడి - 1 టీస్పూన్
- కరివేపాకు తరుగు - 1 టేబుల్ స్పూన్
- ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు - కొద్దిగా (దోశపై చల్లడానికి)
- కొత్తిమీర తరుగు - కొంచెం
తయారీ విధానం:
1. ముందుగా దోశ పిండిని సిద్ధం చేయాలి. ఒక మిక్సీ జార్లో గోధుమపిండి, బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, పులిసిన పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, నెయ్యి, 2 కప్పుల నీరు వేసి, అన్ని పదార్థాలు సమానంగా కలిసేలా మెత్తగా గ్రైండ్ చేయాలి.
2. గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని, మూత పెట్టి 10-15 నిమిషాలు పక్కన ఉంచాలి. పావుగంట తర్వాత పిండి కాస్త చిక్కబడుతుంది. అప్పుడు కాస్త నీరు చేర్చి, రవ్వ దోశ కన్సిస్టెన్సీకి సరిపడా కలపాలి.
3. పిండిలో జీలకర్ర-మిరియాల పొడి, కరివేపాకు తరుగు వేసి బాగా కలపాలి.
4. స్టవ్పై దోశ పెనం వేడి చేసి, మీడియం మంటలో ఉంచి, కొద్దిగా నూనె రాసి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర తరుగును సమానంగా చల్లాలి.
5. సిద్ధం చేసిన పిండిని గరిటెతో తీసుకొని, రవ్వ దోశలా పెనం మీద సమానంగా పరచాలి. కొద్దిగా నూనె చల్లి, దోశ అన్ని వైపులా బాగా కాలే వరకు కాల్చి, అట్ల కాడతో మడిచి ప్లేట్లోకి తీసుకోవాలి.
6. వేడి వేడిగా టమాట చట్నీ, పల్లీ చట్నీ లేదా ఇష్టమైన చట్నీతో సర్వ్ చేయాలి. గోధుమపిండితో రుచికరమైన, క్రిస్పీ దోశలు సిద్ధం!
టిప్స్:
- బియ్యప్పిండి, బొంబాయి రవ్వ చేర్చడం వల్ల దోశలు క్రిస్పీగా, రుచిగా వస్తాయి.
- పులిసిన పెరుగు ఉపయోగించడం వల్ల దోశలు చప్పగా కాకుండా రుచికరంగా ఉంటాయి.