పొంగల్ అంటేనే పండగ స్పెషల్! గుడిలో ప్రసాదంగా, ఇంట్లో వివిధ రకాలుగా తయారయ్యే ఈ వంటకం, కొన్ని చిన్న మార్పులతో మరింత రుచిగా మారుతుంది. ఈ సులభమైన చిట్కా తెలుసుకోవాలనుందా?
కావలసినవి:
- బియ్యం: 1 కప్పు (110 గ్రాములు)
- పెసరపప్పు: 1 కప్పు
- పచ్చిమిరపకాయలు: 2
- అల్లం తురుము: 2 టీస్పూన్లు
- జీడిపప్పు: 3 టేబుల్ స్పూన్లు
- కరివేపాకు: కొద్దిగా
- ఇంగువ: చిటికెడు
- మిరియాలు: 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
సోనా మసూరి కంటే దోసె బియ్యం లేదా కర్నూల్ బియ్యం ఉపయోగిస్తే మెరుగైన రుచి వస్తుంది. సోనా మసూరి మొదట మెత్తగా ఉండి, తర్వాత పొడిపొడిగా అయిపోతుంది, రుచి కూడా తగ్గుతుంది. బియ్యాన్ని శుభ్రంగా కడిగి 30 నిమిషాలు నీటిలో నానబెట్టండి.
1 కప్పు పెసరపప్పును తీసుకొని బాణలిలో సువాసన వచ్చే వరకు తక్కువ ఉడుకులో దోరగా వేయించండి. ఇప్పుడు 4 కప్పుల నీటిని మరిగించి, అందులో కొద్దిగా ఉప్పు, నానబెట్టిన బియ్యం, వేయించిన పెసరపప్పు వేసి మూత పెట్టండి. కుక్కర్లో కాకుండా విడిగా ఉడికించడం వల్ల రుచి బాగుంటుంది.
సిమ్లో ఉడుకుతుండగా, మరో బాణలిలో మీకు నచ్చినంత నెయ్యి వేయండి (ఎక్కువ నెయ్యి అంటే ఎక్కువ రుచి, సుగంధం!). అందులో 2 పచ్చిమిరపకాయలు, 2 టీస్పూన్ల అల్లం తురుము, కరివేపాకు, 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి ఎర్రగా వేయించండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, చిటికెడు ఇంగువ వేసి సువాసన వచ్చే వరకు సిమ్లో వేయించండి.
ఉడికిన పొంగల్లో ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలపండి. ఒక నిమిషం మూత పెట్టి, స్టవ్ ఆఫ్ చేసి దించేయండి. పొంగల్ కాస్త జారుగా ఉన్నా, కొద్దిసేపటికి సరైన స్థిరత్వంలోకి వస్తుంది. ఈ విధంగా చేస్తే బియ్యం ఆకారం అలాగే ఉంటుంది, మధ్యాహ్నం తిన్నా పొడిపొడిగా మారదు.మీరు ఈ విధానంలో పొంగల్ని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, సరేనా?