Rayalaseema Special Chitlam Podi:ఉదయం హడావిడిలో ప్రతిరోజూ ఇడ్లీ, దోశ, వడ లాంటి టిఫిన్స్ లోకి చట్నీ చేయాలంటే కాస్త కష్టమే. అలాంటప్పుడు చట్నీతో పనే లేకుండా, అదిరిపోయే రుచినిచ్చే 'రాయలసీమ స్పెషల్ చిట్లం పొడి' చేసి పెట్టుకుంటే భలే ఉంటుంది.
కమ్మని పప్పులు, ఘాటైన మిరియాలు, ఎండుమిర్చితో చేసే ఈ పొడి ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు. పైగా ఇది రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది. మరి ఈ కమ్మని పొడిని సులభంగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం..
మినపప్పు – 1/4 కప్పు
పచ్చి శనగపప్పు – 1/4 కప్పు
కంది పప్పు – 1/4 కప్పు
ఎండుమిర్చి – 20 నుంచి 30
మిరియాలు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
చింతపండు – చిన్న ఉసిరికాయంత
ఉప్పు – రుచికి సరిపడా
వెల్లుల్లి రెబ్బలు – ఆప్షనల్ (ఇష్టం ఉంటే వేసుకోవచ్చు)
ఇంగువ, బెల్లం – కొద్దిగా (మీ రుచిని బట్టి)
ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మినపప్పు, పచ్చి శనగపప్పు, కందిపప్పు వేసి సన్నని మంటపై (లో ఫ్లేమ్) దోరగా, కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
అదే ప్యాన్లో ఎండుమిరపకాయలను కూడా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, మిరియాలను కూడా వేసి కాస్త వేయించి ముందుగా వేపిన పప్పుల్లో కలుపుకోవాలి. చివరగా పెనంపై ఉన్న వేడికి చింతపండును కూడా కొద్దిసేపు అటు ఇటు తిప్పి వేడి చేసి పక్కన పెట్టుకోవాలి.
పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత, ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా ఎండుమిర్చి, ఉప్పు, చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
మిర్చి నలిగిన తర్వాత, అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు, మిరియాలు, జీలకర్ర మిశ్రమాన్ని వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే చివరిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కాస్త ఇంగువ, కొద్దిగా బెల్లం వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకుంటే రుచి మరింత అద్భుతంగా వస్తుంది.
ఘుమఘుమలాడే రాయలసీమ స్పెషల్ 'చిట్లం పొడి' రెడీ! గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని గాలి చొరబడని సీసాలో (ఎయిర్ టైట్ కంటైనర్) స్టోర్ చేసి పెట్టుకుంటే రెండు నెలల పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది.
ఉదయం వేడి వేడి టిఫిన్స్ లోకి కొద్దిగా నెయ్యి కలుపుకుని ఈ పొడితో తింటే ఆ మజాయే వేరు. ఇంకెందుకు ఆలస్యం, మీరూ ట్రై చేయండి!

